టెక్నాలజీ ఎంతగా పెరిగినా.. మూఢనమ్మకాలు మాత్రం మరుగున పడనే లేదు. మత గురువులు ఆదేశించారని.. బాలికను 64 రోజుల ఉపవాస దీక్షకు కూర్చోబెట్టి.. ఆమె ప్రాణాలు బలిగొన్నారు. ఏకంగా 64 రోజులు ఆకలిని దింగమింగుకుని, మతపెద్దలు చెప్పారని, తల్లిదండ్రులు చెప్పారని ఆ బాలిక దీక్షకు కూర్చుంది. అయితే 64 రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయింది.
ఆకలి బాధను దిగమింగుకుని... అస్వస్థతతో చివరికి మృత్యుఒడికి చేరుకుంది. వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ పాట్ బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బంగారు నగల వ్యాపారి లక్ష్మీ చంద్ మానిష్, సమారియా దంపతులు. వీరి కూతురు ఆరాధన. ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. వారి మతాచారం ప్రకార ఆరాధనను 64 రోజుల ఉపవాస దీక్షకు కూర్చో బెట్టారు. ఆమె దీక్ష అక్టోబర్ 1న ముగిసింది.
దీక్ష సమయంలో సాయంత్రం 6 గంటల లోపు కేవలం మంచినీళ్లు మాత్రమే తాగాల్సి ఉంటుంది. దీంతో ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. దీక్ష మధ్యలో అనేక సార్లు స్పృహ కోల్పోయింది. సెల్ఫీలు తీసుకున్నారు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీక్ష ముగిసిన మూడో రోజున ఈ నెల 3న బాలిక స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందతూ అదే రోజు మరణించింది. బాలిక మృతిపై బాలల హక్కుల సంఘం నాయకులు నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు.