వచ్చే అక్టోబరు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు.
జనసేన కోసం పని చేసే సమర్థులైన యువకులను ఎంచుకుంటున్నామని, అది పూర్తయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, వారంలో మూడు రోజులు రాజకీయాలకు కేటాయిస్తానని అన్నారు. గరగపర్రు, పశ్చిమగోదావరి జిల్లాలోని తందుర్రు ఆక్వాపార్క్ ఘటనలపై స్పందించకపోవడానికి కారణమేంటంటే... ఆ రెండూ సున్నితమైన అంశాలని అన్నారు.
అంబేద్కర్, అల్లురి సీతారామరాజుకు కులాలు అంటగట్టడం సమంజసం కాదని ఆయన సూచించారు. ఆక్వాఫుడ్ పార్క్ లో నిబంధనలన్నీ అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు అమలవుతున్నాయా? అని అడిగారు. ప్రతి సమస్య పోలీసులతో అణచివేస్తే సరిపోతుందని ప్రభుత్వం భావించడం సరికాదన్నారు.
ఇకపోతే దశాబ్దాలుగా పేరుకుపోయిన ఉద్దానం కిడ్నీవ్యాధిగ్రస్తుల సమస్యపై ప్రజలతో కలిసి పోరాడానని, ప్రజల అనారోగ్య సమస్యను అంతర్జాతీయ సమాజానికి తెలిపానని తెలిపారు. ఉద్దానం సమస్యపై రాజకీయ విమర్శలు చేస్తే సమస్య పక్కదారి పడుతుందన్నారు. మనుషుల ప్రాణాలు కోల్పోతున్నప్పుడు రాజకీయలబ్ధి పొందడం దిగజారుడుతనమన్నారు. సమాజాన్ని ఒక తాటి మీదకి తెచ్చేందుకు, ప్రజలంతా ఏకమై సమస్యలు ఎదుర్కొనేందుకు రాజకీయ వేదికలు కావాలని ఆయన పిలుపునిచ్చారు.