గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించాలని, బల్క్ ఆర్డర్లకు అనుమతులు జేసీకి అప్పగించాలని ఇసుకపై సీఎం వైయస్ జగన్ శుక్రవారం నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వైరస్ కారణంగా రీచ్లన్నీ మూతబడ్డాయన్న అధికారులు ఇప్పుడిప్పుడే.. మళ్లీ రీచ్లు ప్రారంభమవుతున్నాయని, వారం, పదిరోజుల్లో రోజుకు 3 లక్షల టన్నులు ఉత్పత్తిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం జగన్కు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి బల్క్ బుకింగ్ ఉంటే... సూపరింటెండెంట్ ఇంజినీర్, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వండి. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ను చేసుకునే అవకాశం ఇవ్వాలి. డిపోల నుంచే ఇసుక సరఫరా చేయాలి, నియోజకవర్గానికి ఒకటే రేటు ఉండేలా చూడాలన్న సీఎం ఇసుక రీచ్ల్లో అక్రమాలు లేకుండా చూడాలని ఆదేశించారు.