కేవీపీ ప్రత్యేక హోదా బిల్లుకు అనుకూలంగా ఓటేయండి : చంద్రబాబు

బుధవారం, 11 మే 2016 (08:36 IST)
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఏపీ ప్రత్యేక హోదా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని టీడీపీకి చెందిన ఎంపీలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీచేశారు. 
 
బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని కేంద్రమంత్రి సుజనా చౌదరిని కూడా బాబు ఆదేశించినట్లు టీడీపీ ఎంపీ ఒకరు తెలియజేశారు. ప్రత్యేక హోదా అంశంపై వెనక్కి తగ్గేది లేదని, పైగా కేవీపీ బిల్లుకు మద్దతిస్తే టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదని చంద్రబాబు భావిస్తున్నారు. 
 
ప్రత్యేక హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో మార్పులు చేసే ఆలోచన కేంద్రానికి లేదని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా లేఖ రాసిన తర్వాతే టీడీపీ వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలిసింది. అలాగే, ప్రత్యేక హోదాపై బీజేపీ వైఖరిలో మార్పు తెచ్చేందుకే ఈ బిల్లుకు మద్దతిస్తున్నట్టు బీజేపీకి కూడా వెల్లడించాయి.  
 
మరోవైపు కేవీపీ ప్రవేశపెట్టిన ప్రత్యేక బిల్లుపై 13వ తేదీన చర్చ జరిగినప్పుడు.. ఇంతవరకు రాష్ట్రానికి ఆయా శాఖలవారీగా విడుదల చేసిన నిధుల జాబితాను సభ ముందు పెట్టాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. కేంద్రం అందజేసిన నిధులపై గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజమహేంద్రవరం సభలో చెప్పిన లెక్కలతో పాటు బడ్జెట్‌లో కేటాయించిన నిధులను కూడా వివరించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి