వైఎస్ మృతదేహం హైదరాబాద్‌కు తరలింపు

నల్లమల అడవుల్లో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికకాయాన్ని కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. గురువారం సాయంత్రం 4.35 గంటల సమయంలో వైఎస్ మృతదేహాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో కర్నూలు నుంచి అధికారిక యంత్రాంగం హైదరాబాద్ తీసుకెళ్లింది.

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి ఈ హెలికాఫ్టర్ వెళుతుంది. అక్కడికి వెళ్లిన తరువాత వైఎస్సార్ భౌతికకాయాన్ని ఎక్కడికి తీసుకెళ్లనున్నారనే దానిపై వివిధ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌తోపాటు హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన మిగిలిన నలుగురి మృతదేహాలను వారి నివాసాలకు పంపుతారు.

వైఎస్ భౌతికకాయాన్ని అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం శుక్రవారం ఉదయం ఎల్బీ స్టేడియంలో ఉంచుతారు. శుక్రవారం సాయంత్రం పులివెందులలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళుతున్న వైఎస్సార్ మార్గమధ్యంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో చిక్కుకొని మృతి చెందారు.

వెబ్దునియా పై చదవండి