అందరికీ శుభం జరగాలి: ముఖ్యమంత్రి రోశయ్య

శుక్రవారం, 1 జనవరి 2010 (15:05 IST)
నూతన సంవత్సరం 2010లో అన్ని వర్గాల ప్రజలకు శుభం జరగాలని ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడచిన ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విపత్కర పరిణామాలు చోటుచేసుకున్నాయని, వాటిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ దుర్మణం చెందడం తనలాంటివారికి కలసివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దివంగత వైఎస్ఆర్ దుర్మరణం చెందడం అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు రాష్ట్ర ప్రజలకు తీరని లోటని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. నిరుడు రాష్ట్రంలో వరదలు ముంచెత్తాయని, అలాంటి వరద తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. అలాగే వరద ముంపుకు గురైన ప్రాంతాలలోని ప్రజలు పలు అవస్థలకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో చేపట్టిన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం ప్రకృతి సహకరించాలని, నిరుడులా కాకుండా సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు చేతికి అందితే అదే అందరికి శుభం చేకూరినట్లని ఆయన అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి