అన్న జైలుకు ఎందుకెళ్లారో షర్మిలకు తెలియదా!?: బొత్స ప్రశ్న

ఆదివారం, 10 జూన్ 2012 (15:03 IST)
FILE
అన్నయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైలుకెళ్లారో షర్మిలకు తెలియదా అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నీతి గురించి ఉచ్చరించే అర్హత షర్మిలకు లేదని విమర్శించారు.

బయ్యారం గనుల విషయంలో ఆమె నీతి ఏంటో చెప్పాలని బొత్స ప్రశ్నించారు. తన కుమారుడు ముందు నుంచి వ్యాపారస్తుడైతే ఆదాయాలు లెక్కలు చూపించవచ్చు కదా అని విజయమ్మను బొత్స అడిగారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది హత్యలు, ఆర్థిక నేరాలు కాదని, అభివృద్ధేనని చెప్పారు. విజయ, షర్మిల మాటలు చూస్తే దొంగే దొంగ అంటూ పారిపోతున్నట్లుందని ఎద్దేవా చేశారు.

జైల్లో ఉన్న జగన్ పార్టీకి ఓటేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటో ప్రజలు ఆలోచించాలని బొత్స అన్నారు. సానుభూతిని పణంగా పెట్టి వై.ఎస్. విజయమ్మ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బొత్స విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి