తెలంగాణపై వై.ఎస్. జగన్‌కు స్పష్టత లేదు: ఎర్రబెల్లి ధ్వజం

FILE
ప్రత్యేక తెలంగాణ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి స్పష్టత లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తెలంగాణపై జగన్మోహన్ రెడ్డి ప్రకటనపై ముందుగా జగన్ వర్గానికి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే కొండా సురేఖకే క్లారిటీ లేదని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడని, ఆయనో దోపిడిదారుడని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు.

అలాగే తెలంగాణ కోసం ఉద్యమం అంటున్న వారు సీమాంధ్రులతో కలిసి వ్యాపారులు చేస్తున్నప్పుడు తప్పులేనప్పుడు తాము సీమాంధ్ర బస్సుల్లో యాత్ర చేస్తే తప్పేంటని ఎర్రబెల్లి తెరాసను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ సభలను అడ్డుకోవడం తెరాసకు సమంజసం కాదన్నారు. ప్రతి తెలంగాణ వాదికి ఆచార్య జయశంకర్ ఫోటో పెట్టుకునే అర్హత ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన వంటా వార్పు, రైలు రోకో కార్యక్రమాలు తమకు పోటీగా పెట్టినవేనని ఎర్రబెల్లి ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు చేస్తున్న యాత్ర మూర్ఖపు యాత్ర అని ఎర్రబెల్లి విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి