తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తే.. అంతే సంగతులు!

FILE
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. తమకు తెలంగాణ సాధనే లక్ష్యమని, పదవులు ఏ మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. చర్చల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తే ఏ మాత్రం వూరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని హరీష్ రావు అన్నారు. ప్రత్యేక తెలంగాణపై కేంద్రం ప్రకటించే అంశం కోసమే మౌనంగా ఉన్నామని ఆయన చెప్పారు.

పదవీ త్యాగాలతోనే తెరాస అధినేత తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని తెరాస ఎమ్మెల్యే తెలిపారు. పదవులను ఆశించే కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని వెలువెత్తిన ఆరోపణలను హరీష్ రావు కొట్టి పారేశారు.

ఇదిలా ఉంటే.. తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు ఆదివారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ కానున్నట్లు ఆ పార్టీ శ్రేణుల సమాచారం. ఈ సమావేశంలో భాగంగా ప్రత్యేక తెలంగాణపై ప్రధానితో కేసీఆర్ చర్చలు జరిపే అవకాశం ఉందని తెలిసింది.

వెబ్దునియా పై చదవండి