తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొత్త ఉద్యోగాలు ఫట్: లగడపాటి

FILE
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీకి లగడపాటి శుక్రవారం ఆరవ నివేదికను అందజేశారు.

ఈ నివేదికలో ఏ తెలంగాణ నాయకుడు కానీ, వారి కుటంబ సభ్యులు కానీ ఆత్మహత్యలకు పాల్పడలేదని ఎత్తిచూపారు. ఇంకా వేర్పాటువాదుల విష ప్రచారానికి ఎంతోమంది అమాయక యువత, విద్యార్థులు ఆత్మహత్యలతో బలైపోయారని లగడపాటి అన్నారు.

ఇదిలా ఉంటే.. శ్రీకృష్ణ కమిటికీ ఈ నెల 8వ తేదీన నివేదిక ఇవ్వాలని తెలుగుదేశం తెలంగాణ ఫోరం నిర్ణయించింది. ఇందుకోసం ఏడోతేదీ సాయంత్రానికి తెదేపా నేతలు ఢిల్లీకి చేరుకుంటారని తెదేపా పార్టీ శ్రేణులు తెలిపాయి.

మరోవైపు.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పాతబస్తీలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో పర్యటనను వాయిదా వేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనను కమిటీ అంగీకరించింది. దీంతో ఈనెల 31వ తేదీన హైదరాబాద్‌కు రావాల్సిన కమిటీ సభ్యులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. రాజధానిలో పరిస్థితి చక్కబడితే వీరు రాష్ట్రానికి వస్తారు.

వెబ్దునియా పై చదవండి