నేటితో ముగియనున్న శ్రీకృష్ణ కమిటీ నివేదిక గడువు!

FILE
ప్రత్యేక తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించే గడువు నేటితో ముగియనుంది. దీంతో తెలుగుదేశం పార్టీ 200 పేజీలతో కూడిన నివేదికను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్‌కు శనివారం సమర్పించింది. ఇందులో శాస్త్రీయ, చారిత్రాత్మక ఆధారాలకు అనుగుణంగా 19 పాయింట్లను పొందుపరిచినట్లు తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌తో కలిగే లాభాల గురించి ఈ నివేదికలో శ్రీకృష్ణ కమిటీకి ఎత్తి చూపినట్లు తెదేపా మంత్రులు మీడియాతో తెలిపారు. ఇంకా 1956 సంవత్సరం తర్వాత రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామిక, విద్య, వ్యవసాయ వంటి 11 రంగాలపై సూక్ష్మంగా పరిశీలించిన విషయాలను కూడా కమిటీకి సమర్పించిన నివేదికలో జత చేసినట్లు తెదేపా మంత్రులు వెల్లడించారు.

ఇంకా.. ఏయే ప్రభుత్వాలు, ఏయే ప్రాంతాలకు.. ఎంతెంత నిధులు, ఏయే కాలంలో కేటాయించాయనే అంశాలను పూర్తి గణాంకాలతో శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు తెదేపా తెలిపింది. దీనికి శ్రీకృష్ణ కమిటీ సానుకూలంగా స్పందించినట్లు తెదేపా మంత్రులు వెల్లడించారు. ఇదిలా ఉంటే శనివారం ఉదయం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు, సీమాంధ్ర తెదేపా ప్రజా ప్రతినిధులు నివేదిక సమర్పించారు.

మరోవైపు.. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర రాజకీయ పార్టీలతో జరిపే తొలి దశ చర్చలు మే నెలలో ఉంటాయని, రెండో దశ చర్చలు జూలైలో ఉంటాయని సమాచారం.

వెబ్దునియా పై చదవండి