పొన్నూరు ఎస్సై‌కు 14 రోజుల రిమాండ్

మంగళవారం, 18 ఆగస్టు 2009 (18:21 IST)
బీఫార్మసీ విద్యార్థి రజియా బేగంను మోసం చేసిన కేసులో గుంటూరు జిల్లా పొన్నూరు ఎస్సై రంగనాథ్ గౌడ్‌కు తెనాలి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. దీంతో ఎస్సైను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఫలితంగా ఆయన వచ్చే నెల ఒకటో తేదీ వరకు జైలు జీవితం గడపాల్సిన దుస్థితి నెలకొంది.

అంతకుముందు రజియా సుల్తానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు రంగనాథ్ గౌడ్‌ను మంగళవారం అరెస్టు చేశారు. గౌడ్‌ను అరెస్టు చేసేందుకు గుంటూరులో ఆయన బసచేసిన హోటల్‌కు పోలీసులు వెళ్లారు. దీన్ని పసిగట్టిన రంగనాథ్.. హోటల్ గోడ దూకి కారులో పారిపోయాడు.

అయితే, తెనాలి జాతీయ రహదారిపై రేపల్లే పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను డీఎస్పీ ఎదుట హాజరుపరిచి, ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. ఇదిలావుండగా, రంగనాథ్ గౌడ్‌కు న్యాయం చేయాలని కోరుతూ పొన్నూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన అనుచరులు ధర్నాకు దిగారు.

వెబ్దునియా పై చదవండి