రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ బిల్లును పెడితే ఈ బిల్లును ఎందుకు సభలో పెట్టామా అంటూ కాంగ్రెస్ పార్టీ చింతించాల్సి ఉంటుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హెచ్చరించారు. అంతేకాకుండా ఆయన కాంగ్రెస్ హైకమాండ్కు ఓ అల్టిమేటం కూడా జారీ చేశారు.
పునర్వ్యస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబోమని బుధవారం ఉదయం 11 గంటలలోపు చెప్పాలని, లేకుంటే పార్లమెంటును ఒక్క క్షణం కూడా నడవనివ్వబోమని హెచ్చరించారు. బిల్లు ప్రవేశపెట్టాలని అధిష్టానం భావిస్తే, ఎందుకు ప్రవేశపెట్టామా అని చింతించాల్సి ఉంటుందని తీవ్రస్వరంతో స్పష్టం చేశారు.
బిల్లును ప్రవేశపెడితే కొరివితో తలగోక్కున్నట్టే అని వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవడంతోపాటు ముఖ్యమంత్రితో సహా తామందరం మౌనదీక్ష చేపడతామని లగడపాటి తెలిపారు.