రాయలసీమ పర్యటనకు ప్రజారాజ్యం సిద్ధం!

ఉత్తరాంధ్ర, తెలంగాణా పర్యటనలు విజయవంతం కావడంతో సమరోత్సాహంలో ఉన్న ప్రజారాజ్యం.. అదే ఊపుతో రాయలసీమ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనకు ఇప్పటికే ప్రణాళికలు ఖరారు చేశారు. పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి రూటు మ్యాపు విడుదల కానున్న తరుణంలో కిరాయి హంతకుడు మొద్దుశీను హత్యతో ఆలస్యం కానుంది.

ప్రస్తుతం ఈ యాత్రను అనంతపురం - కర్నూలులో చేపట్టాలా? లేదా కర్నూలు - కడపల నుంచి చేపట్టాలా? అనే దానిపై పీఆర్పీ కసరత్తు చేస్తోంది. తొలుత రాయలసీమ యాత్రను అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.

అయితే.. ఆ జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా దాన్ని ఉపసంహరించుకున్నారు. కాగా, పార్టీ అధినేత పర్యటనపై పార్టీ నేతలు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. పూర్తిస్థాయి పర్యటన వివరాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నారు.

వెబ్దునియా పై చదవండి