108 సిబ్బంది అదుర్స్... గర్భిణీని స్ట్రెచర్‌‌పై మూడున్నర కిలోమీటర్లు మోశారు..

సోమవారం, 12 అక్టోబరు 2020 (10:52 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలో 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. స్ట్రెచర్‌‌పై గర్భిణీని మూడున్నర కిలోమీటర్లు మోశారు. వివరాల్లోకి వెళితే.. ఏజెన్సీ ప్రాంతమైన కుక్కునూరు మండలం తొండిపాక పంచాయతీ రామవరం గ్రామానికి చెందిన కలుము రాజీ (20) అనే వివాహితకు ఆదివారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. 
 
స్పందించిన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. 108 వాహనంతో రామాపురం చేరుకునేందుకు వెళ్ళినా రామాపురానికి వాహనం వెళ్లే దారిలేదు. మూడున్నర కిలోమీటర్లు నడిస్తేనే ఆ గర్భిణీ ఉన్న ఊరు చేరుకోగలరు. 
 
దీంతో వెంటనే వాళ్ళు మరేమీ ఆలోచించకుండా వాహనంలోని స్ట్రెచర్‌ పట్టుకుని నడుచుకుంటూ వెళ్లారు. ఆమెను స్ట్రెచర్‌ మీదకి ఎక్కించి కాలినడకన బంధువుల సహాయంతో స్ట్రెచర్ పై మోస్తూ అంబులెన్స్ వద్దకు తరలించారు. అక్కడ నుంచి గర్భిణీని కుక్కునూరు ఆసుపత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు