పార్టీ చేసుకున్నారు.. పైలోకానికెళ్లారు.. బీటెక్ విద్యార్థుల దుర్మరణం

బుధవారం, 1 మే 2019 (10:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. వీరంతా మందు పార్టీ చేసుకుని ఇంటికి బయలుదేరగా, మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇబ్రహీంపట్నం శ్రీహిందూ కాలేజీకి చెందిన కొంతమంది విద్యార్థులు వార్షిక పరీక్షలు పూర్తికావడంతో బొమ్మల రామారంలోని పెట్రోల్ బంకు ఆవరణలో ఉన్న ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పార్టీ చేసుకున్నారు. తర్వాత కారులో తిరుగు ప్రయాణ మార్గంలో వీరంతా ప్రమాదానికి గురయ్యారు. 
 
ఈ ప్రమాదంలో కొత్తపేటకు చెందిన స్ఫూర్తి (22), చాదర్‌ఘాట్‌‌కు చెందిన ప్రణీత(22) ప్రగతి నగర్‌కు చెందిన చైతన్య (23)లు మృతి చెందారు. కుట్లూరుకు చెందిన మనీష్ రెడ్డి, చంపాపేట్‌కు చెందిన వినిత్ రెడ్డి‌లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో వినిత్ రెడ్డిని ప్రాణాలు విడిచాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు