ఆటో డ్రైవరుతో ప్రేమాయణం, ఇంటి నుంచి పారిపోయిన బాలిక, ఆ తరువాత..? (video)

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (18:06 IST)
తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ మోజులో పడిన బాలిక ప్రియుడితో కలిసి పరారైన ఘటన విజయవాడ నగరంలో జరిగింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంకు చెందిన ఒక బాలిక తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇటీవల సెల్‌ఫోన్‌ ఎక్కువగా గడుపుతున్న ఆమె ఒక ఆటోడ్రైవర్‌తో ప్రేమలో పడింది. 
 
రోజుల తరబడి అతడితో ఛాటింగ్ చేస్తూ చదువును పట్టించుకోవడం మానేసింది. నెల రోజుల క్రితం తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు షాకయ్యారు. తెలిసీతెలియని వయస్సులో ప్రేమేంటని చీవాట్లు పెట్టారు. పిచ్చి చేష్టలు మానుకుని బుద్ధిగా చదువుకోవాలని సూచించారు. అయినా ఆమెలో మార్పు కనిపించకపోవడంతో విజయవాడ భవానీపురంలో ఉండే మేనత్త వద్దకు ఈ నెల 19న బాలికను పంపారు. కూతురితో మాట్లాడేందుకు సెల్‌ఫోన్ ఆమె వద్దే ఉంచారు. దీంతో బాలిక మళ్లీ మేనత్త ఇంటి నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగించింది.
 
నిన్న మేనత్త పనిమీద బయటకు వెళ్లి కాసేపటి తర్వాత వచ్చింది. ఇంట్లో మేనకోడలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారిని అడిగింది. బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా బాలికను గుర్తించిన పోలీసులు ప్రేమజంటను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. 
 
చిన్న వయస్సులో ప్రేమ వ్యామోహంలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని బాలికకు సూచించి తల్లిదండ్రులకు అప్పగించారు. మరోసారి బాలికతో మాట్లాడినా, ప్రేమ పేరుతో వేధించినా జైలుకు పంపిస్తామని ఆటోడ్రైవర్‌ను హెచ్చరించి వదిలేశారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు