శ్రీసిటీని సందర్శించిన జపాన్ ప్రభుత్వ ప్రతినిధుల బృందం.. ఎందుకో తెలుసా?

బుధవారం, 25 ఆగస్టు 2021 (08:58 IST)
న్యూఢిల్లీలోని  జపాన్ రాయబార కార్యాలయం  ఎకనామిక్ డివిజన్ హెడ్ షింగో మియామోటో, రెండవ కార్యదర్శి హోసాకా, చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ వొడాగవ లతో కూడిన అత్యున్నత శ్రేణి జపాన్ ప్రభుత్వ ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది.

స్థానిక బిజినెస్ సెంటర్‌ వద్ద శ్రీసిటీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రమణ్యం వారికి సాదర స్వాగతం పలికారు. ఇక్కడ మౌళిక వసతులు, పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలు, వ్యాపారానుకూల వాతావరణం గురించి ప్రదర్శన ఇచ్చారు. ఇక్కడ పెట్టుబడిదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా కలిగే రాయితీలు, ప్రయోజనాలను వివరించారు.

ఈ సమావేశంలో శ్రీసిటీలోని జపాన్ పరిశ్రమల ప్రతినిధులు సకామోటో (ఛైర్మన్, ఇసుజు మోటార్స్), ఇవామి (ఎండీ, ఐఎంఓపి), యమగుచి (ఎండీ, టోరే), హిరానో (ఎండీ, పయోలాక్స్) పాల్గొన్నారు.
 
శ్రీసిటీ ఓ అద్భుతమైన ప్రదేశంగా అభివర్ణించిన షింగో మియామోటో, శ్రీసిటీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, వ్యాపార అవకాశాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు.   
 
జపాన్ ప్రతినిధుల పర్యటనను స్వాగతించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఇప్పటి వరకు శ్రీసిటీలో ఏర్పాటైన పరిశ్రమలలో 15 శాతం జపాన్ కు చెందినవి కాగా, 1.3 బిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని, తద్వారా దేశంలో జపాన్ కంపెనీలకు శ్రీసిటీ రెండవ అతిపెద్ద పెట్టుబడి గమ్య స్థానంగా నిలిచిందన్నారు.

ఇక్కడ అనుకూలమైన వ్యాపార వాతావరణం, ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు, సమర్ధవంతమైన శ్రామికశక్తి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ఖచ్చితంగా వారిని ఆకట్టుకుంటుందన్నారు. జపాన్ బృందం పర్యటన ఆ దేశం నుంచి మరిన్ని చిన్న, మధ్య, భారీ పరిశ్రమల పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 
 
జపాన్ బృందం పర్యటనలో సీనియర్ జపనీస్ ప్రభుత్వ అధికారులు, జపనీస్ కాన్సులేట్ కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు.

శ్రీసిటీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నేరుగా సందర్శించడం, ఇక్కడ వ్యాపార సామర్థ్యాన్ని అంచనా వేయడం, పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం వీరి పర్యటన ఉద్ద్యేశం. శ్రీసిటీ అధికారులతో జరిగిన చర్చల్లో జపాన్ ప్రతినిధులు శ్రీసిటీ గురించి వివిధ అంశాలను ఎంతో ఆసక్తితో అడిగి తెలుసుకున్నారు. అనంతరం పారిశ్రామికవాడ పరిసరాలు, ఇసుజు, టోరే పరిశ్రమలను సందర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు