నీటి మీటర్ల పేరుతో వ్యాపారానికి తెరలేపిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

శుక్రవారం, 20 ఆగస్టు 2021 (17:51 IST)
అమృత్ పథకం పేరుతో పాలకులు విషం చిమ్ముతున్నారని కమ్యూనిస్టులు ఆరోపించారు. అందుకే ఇంటి పన్ను పెంపు ,చెత్త పన్నుకు తోడు నీటి మీటర్ల బిగింపుకు రంగం సిద్ధం చేసారన్నారు. విజయవాడలో నీటి మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా సిపిఎం ఆందోళన చేసింది. ఈ ఆందోళనలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు,డి. కాశీనాథ్ తదితరులు మాట్లాడుతూ, పట్టణ సంస్కరణల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటి లోని నీటి కుళాయికి నీటి మీటర్లు బిగించటం గర్హనీయమన్నారు. 24 గంటల నీటి సరఫరా సాకుతో నీటి మీటర్ల బిగింపుకు కుట్ర చేస్తున్నారని, నీటి మీటర్ల ద్వారా మంచి నీటితో వ్యాపారం ప్రారంభించారని ఆరోపించారు.

సంక్షేమం పేరు చెప్పి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న ప్రభుత్వాలు. మున్సిపల్ ఎన్నికలు ముగిసి ఐదు నెలలు తిరగక ముందే ఆస్తి విలువ ఆధారిత పన్ను ద్వారా భారం మోపారన్నారు. చెత్త పన్ను పేరుతో ప్రజల నడ్డి విరిచారు. ఇప్పుడు నీటి మీటర్ల పేరుతో మంచి నీటిని వ్యాపార సరుకుగా మార్చారని విమర్శించారు. భవిష్యత్తులో మరుగుదొడ్ల లెక్కించి డ్రైనేజీ పైన పన్నులు విధించడానికి రంగం సిద్ధం చేయడం సిగ్గుచేటని చెప్పారు.

కరోనా కష్టకాలంలో పేదలందరికీ నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని, బతకటానికి నెలకు కనీసం 7,500 రూపాయలు నగదు ఇవ్వాలని, ప్రజలందరూ డిమాండ్ చేస్తుండగా, పేదల ఆదుకోకుండా మంచినీళ్లు కూడా అందుబాటులో లేకుండా చేయటం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకంలో భాగంగా అందరికీ మంచి నీటిని అందిస్తామని చెప్పి నీటి మీటర్ల పేరుతో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. కృష్ణా నది పక్కనే ఉన్నా, మంచి నీరు పుష్కలంగా లభిస్తున్న విజయవాడ నగరంలో వేలాది కుటుంబాలకు నీటి మీటర్లు బిగించాలని నగరపాలక సంస్థ నిర్ణయించడం శోచనీయమన్నారు. ఈ పథకానికి మున్సిపల్ మంత్రి బొత్స ప్రారంభించడం గర్హనీయని, మున్సిపాలిటీలను ప్రభుత్వాలు వ్యాపార సంస్థలుగా

మార్చేస్తున్నాయనివిమర్శించారు. గతంలో పాలకులు నీటి మీటర్లు ఏర్పాటు ప్రయత్నించగా, విజయవాడ నగర ప్రజలు ఐక్య పోరాటాలతో తిప్పికొట్టారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీటి మీటర్లు వ్యతిరేకించిన వైసిపి, నేడు కేంద్రం ఆదేశాలకు లొంగి నీటిమీటర్లు ఏర్పాటు చేయడం ప్రజలను మోసగించడమేనన్నారు. విజయవాడలో ప్రారంభించిన ఈ నీటి మీటర్ల పథకం భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం విస్తరిస్తుందని,. విజయవాడ నగరంలో నీటి మీటర్లకు వ్యతిరేకంగా ప్రజలు అందరినీ కలుపుకొని ఉద్యమిస్తాం, ప్రతిఘటిస్తామని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విజయవాడ కృష్ణ లంక లోని రాణి గారి తోటలో సిపిఎం విజయవాడ తూర్పు సిటీ కమిటీ ఆధ్వర్యంలో నీటి మీటర్లకు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది. కార్యకర్తలు ప్లే కార్డులు ప్రదర్శించి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నీటి ఛార్జీల పేరుతో ప్రజలకు ఉరి వేస్తున్నారంటూ వినూత్న నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో బాబూరావుతో పాటు సిపిఎం నేతలు డి కాశీనాథ్, బి.నాగేశ్వరరావు, హరి నారాయణ, చిన్నారావు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు