సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య..! రైలుకు ఎదురెళ్లి..!

బుధవారం, 4 మార్చి 2015 (12:12 IST)
హైదరాబాదులో మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన చందానగర్, లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. ఆ సమయంలో మృతుడి వద్ద ఉన్న ఐడీకార్డు, ఫోన్ నంబర్ల ఆధారంగా అతను పని చేస్తున్న కంపెనీకి పోలీసులు సమాచారం అందించారు.
 
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృతుడు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన కొండా వెంకటరెడ్డి (30) అని తెలిసింది. అతను గచ్చిబౌలి లోని డీఎస్ టీ వరల్డ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వెంకటరెడ్డికి రెండేళ్ల క్రితం వివాహమయింది. వీరు మణికొండలో నివాసం ఉంటున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. 
 
కాగా వెంకటరెడ్డికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని, అందరితో సరదాగా ఉండేవాడని తోటి ఉద్యోగుల సమాచారం. అయితే వెంకటరెడ్డి  ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి