చంద్రబాబుకు టవర్ ఏసీ.. నారా బ్రాహ్మణి విజ్ఞప్తి..

శనివారం, 14 అక్టోబరు 2023 (23:46 IST)
టీడీపీ అధినేత చంద్రబాబుకు డీహైడ్రేషన్ కావడంతో ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును ఉంచిన బ్యారక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. 
 
వైద్యుల సలహా మేరకు బ్యారక్‌లో చల్లదనం వుండేలా చర్యలు తీసుకోవాలని జైలు అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు ఆరోగ్య రీత్యా చల్లని వాతావరణం అవసరమని వైద్యులు సిఫార్సు చేసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
గత కొన్నిరోజులుగా విపరీతమైన ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో చంద్రబాబు డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. స్కిల్ కేసులో అరెస్టయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు మద్దతుగా ఇవాళ హైదరాబాదులో ఐటీ నిపుణులు 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. నల్ల టీషర్టులు ధరించి మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ల మధ్య ప్రయాణించారు. అయితే, చంద్రబాబుకు సంఘీభావంగా కదలి వచ్చిన చాలామందిని పోలీసులు అడ్డుకున్నారు.
 
దీనిపై చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి స్పందించారు. బాబు మనసులోంచి పుట్టిన అనేక ఆలోచనల్లో మెట్రో కూడా ఒకటి. ఇవాళ ఆ మెట్రో  ద్వారానే వారంతా చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నించారు. 
 
అయితే ఈ సందర్భంగా తాను పోలీసులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే... ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాదిగా వచ్చిన ప్రొఫెషనల్స్‌కు, మహిళలకు, చిన్నారులకు దయచేసి ఎలాంటి అసౌకర్యం కలిగించకండని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు