రేవంత్ కామెంట్స్: ఏసీబీ డీజీ ఖాన్ భేటీ.. సుప్రీంకు ఓటుకు నోటు కేసు

గురువారం, 2 జులై 2015 (11:04 IST)
ఓటుకు నోటు కేసుకు సంబంధించి బెయిల్ లభించడంతో బుధవారం రిలీజ్ అయిన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టి.సీఎం కేసీఆర్‌తో డీజే ఖాన్ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశంలో వీరిరువురూ ఓటుకు నోటు కేసుపై చర్చించారు. 
 
గత నెల రోజులుగా ఈ కేసులో జరిగిన పురోగతి, పరిణామాలను కేసీఆర్‌కు ఖాన్ వివరించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లనున్నారో కూడా వివరించినట్టు సమాచారం. అలాగే రేవంత్ రెడ్డి బెయిల్‌పై విడుదలైన తర్వాత... కేసీఆర్, తెలంగాణ మంత్రులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. 
 
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపిన ఓటుకు నోటు వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరుకుంది. నెల రోజుల పాటు చర్లపల్లి జైలులో ఉండి బుధవారం బెయిల్‌పై విడుదలైన రేవంత్ రెడ్డికి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్, కేబినెట్ మంత్రులపై పరుష పదజాలంతో కూడిన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
రేవంత్ రెడ్డి ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం ఆడియో కాపీలతో పాటు మీసం మెలేస్తూ రెచ్చగొట్టేలా వ్యవహరించిన వీడియో సీడీలతో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు ఢిల్లీ చేరుకున్నారు. ఈ వీడియోలను సాక్ష్యంగా చూపించి రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని వారు సుప్రీంకోర్టును కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకే సర్కారీ అడ్వొకేట్లు ఢిల్లీ చేరుకున్నారని సమాచారం.

వెబ్దునియా పై చదవండి