ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం: గంగాధరం అక్రమాస్తుల విలువ అన్ని కోట్లా?!

శనివారం, 1 ఏప్రియల్ 2017 (16:04 IST)
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విసిరిన వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ గంగాధరం ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. గంగాధరం కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఏసీబీ శనివారం దాడులు నిర్వహిస్తోంది. 
 
కాగా, గంగాధరంకు బినామీగా కొనసాగుతున్న మరో కాంట్రాక్టర్ విశ్వేశ్వరరావు ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఈ దాడుల్లో అక్రమాస్తులు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. 
 
విశాఖపట్నం భీమిలి వద్ద నాలుగు వరుసల రహదారుల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు, కడప, నెల్లూరు, చిత్తూరు, విశాఖలోని మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. 
 
ఈ దాడుల్లో ఆస్తులను సీజ్ చేయడంతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కూకట్ పల్లి నివాసంలో రూ.40లక్షల నగదును సీజ్ చేయగా, కూకట్ పల్లి రాంకీ టవర్స్‌లో రూ.8కోట్ల విలువైన విల్లాను గుర్తించారు. బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్ల విలువైన ఆస్తి ఉన్నట్లు ఏసీబీ జేడీ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి