మిస్టర్ జగన్.... సీఎంగా ఉన్నపుడే ఏం పీకలేకపోయావ్... నా జోలికి రావొద్దు : శివాజీ హెచ్చరిక

ఠాగూర్

సోమవారం, 9 మార్చి 2026 (13:33 IST)
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు వైకాపా నేతలకు సినీ నటుడు శివాజీ గట్టి హెచ్చరిక చేశారు. మిస్టర్ జగన్.. నా జోలికి రావొద్దు అంటూ గర్జించారు. తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై శివాజీ తీవ్రస్థాయిలో మండిపడుతూ రాజకీయ, సినీ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలు విడుదల కాకముందే కొందరు పనిగట్టుకుని నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారని 'పేటీఎం బ్యాచ్‌' అంటూ సోషల్ మీడియా ట్రోలర్లపై విరుచుకుపడ్డారు. వంది మంది సబ్‌స్క్రైబర్లు కూడా లేనివారు తన గురించి మాట్లాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవడం పెద్ద విషయం కాదన్నారు. "అరేయ్ పేటీఎం బ్యాచ్... నన్ను తగులుకుంటే అది మీకే ప్రమాదకరం" అని హెచ్చరించారు. 
 
రాజకీయాల ప్రస్తావన తెస్తూ వైకాపా అధినేత జగన్‌ను ఉద్దేశించి శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ గారూ... నా జోలికి రావొద్దు. నాకు రాజకీయాలు వద్దు అని పేర్కొంటూనే అమరావతి రైతుల కోసం ఏ పార్టీ మీదనైనా పోరాడుతానని చెప్పారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని సైతం అడుగుతానని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ వంటి వాటిపై ప్రజలకు నమ్మకం కలగాలంటే ముందుగా కేసులు ఉన్న రాజకీయ నాయకులపై విచారణ వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

పైగా, తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదన్నారు. గతంలో అదికారంలో ఉన్నపుడే తనను ఏమీ చేయలేకపోయారని శివాజీ గుర్తుచేశారు. తన పని తాను చేసుకుంటుంటే అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని, నిజాయితీగా బతుకుతున్న తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోనని ఆయన ఘాటుగా హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు