భర్త ఉద్యోగానికి.. భార్య బోయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్.. నిజం తెలిసేసరికి...

మంగళవారం, 20 నవంబరు 2018 (11:47 IST)
అక్రమ సంబంధాలతో ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. సజావుగా సాగుతున్న సంసారాన్ని నాశనం చేస్తున్నాయి. హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. భర్త... లేకుంటే భార్య ఇలా ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పటడుగు వేస్తే కుటుంబం మొత్తం ఛిద్రమవుతోంది. అలాంటి సంఘటనే తూర్పుగోదావరిజిల్లా కాకినాడలో జరిగింది.
 
రాజశేఖర్, రాగిణి భార్యాభర్తలు. ఆరునెలల క్రితం వివాహమైంది. అన్యోన్య దాంపత్యం. రాజశేఖర్ ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. పనిలో రాజశేఖర్ సిన్సియర్ వర్కర్. ఉదయం ఇంటి నుంచి సాయంత్రం వరకు విధి నిర్వహణలో బిజీగా ఉండేవాడు. ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళితే భార్యకు కూడా ఫోన్ చేయకుండా అంతలా పనిచేశాడు. రాజశేఖర్ అంటే ఆఫీస్‌లో పనిచేసే అందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం. 
 
ఇలా సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో ఉన్నట్లుండి అనుకోని పరిణామం జరిగింది. రాజశేఖర్ ఇంట్లో నిద్రిస్తుండగా చనిపోయాడు. రాజశేఖర్ మరణంతో తండ్రి సుబ్బారావు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య రాగిణి మాత్రం తన భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ పోలీసులకు తెలిపింది. అయితే పోస్టుమార్టం చేసిన పోలీసులు రాజశేఖర్‌ను హత్య చేశారని నిర్థారణకు వచ్చారు.
 
దీంతో సుబ్బారావుతో పాటు రాగిణిని పోలీస్టేషన్‌కు పిలిపించి విచారించారు. మొదట్లో తనకేం సంబంధం లేదని, గుండెపోటుతోనే తన భర్త మరణించాడని చెప్పిన రాగిణి ఆ తరువాత నిజాన్ని ఒప్పుకుంది. తాము నివాసముండే ప్రాంతంలో శివారెడ్డి అనే వ్యక్తి ఉండేవాడని, అతనితో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసిందని చెప్పింది. తనకు ఏ అవసరాలు ఉన్నా తీర్చేవాడని, కొత్త బట్టలు, నగలు కొనిచ్చేవాడని చెప్పుకొచ్చింది. తన భర్త సంపాదించే డబ్బులు ఇంటికి సరిపోకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండేవారమని కూడా చెప్పింది. 
 
శివారెడ్డితో పరిచయం ఏర్పడిన తరువాత తనలో వచ్చిన మార్పును భర్త రాజశేఖర్ గమనించాడని, దీంతో శివారెడ్డితో తనకు ఉన్న సంబంధం బయటపడుతుందని భయపడ్డాననీ, దాంతో శివారెడ్డి సలహాతో నా భర్తను చంపాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి పూట శివారెడ్డిని ఇంటికి పిలిపించి రాజశేఖర్‌ను గొంతు నులిమి చంపేసినట్లు అసలు నిజం ఒప్పుకుంది. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు