భర్త తలను ఒడిలో పెట్టుకున్న భార్య.... మాటు వేసిన ప్రియుడు సుత్తితో కొట్టి చంపేశాడు..

బుధవారం, 23 ఆగస్టు 2023 (10:59 IST)
కట్టుకున్న భర్తను భార్య కడతేర్చింది. తన మాయమాటలతో నమ్మించి తన వెంట తీసుకెళ్లి ప్రియుడితో ప్రాణాలు తీయించింది. భర్త తలను ఒడిలో పెట్టుకున్న భార్య.... మాటు వేసిన ప్రియుడు సుత్తితో కొట్టి చంపేశాడు. ఈ దారుణం అనకాపల్లి జిల్లాలో జరగింది. ఈ హత్య కేసు వివరాలను నర్సీపట్నం ఏఎస్పీ అధిరాజా సింగ్ వివరిస్తూ, 
 
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లం పేటకు చెందిన గుడివాడ అప్పలనాయుడు (33), జానకి (24) భార్యాభర్తలు. పాతకృష్ణదేవిపేటకు చెందిన తాపీమేస్త్రి చింతల రాము (34)తో జానకికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరు రోజూ ఫోనులో మాట్లాడుకోవడం గమనించిన భర్త.. జానకిని పనికి పంపించడం లేదు. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి భర్త అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిపి ఆమె పన్నాగం పన్నింది. 
 
భర్తకు మాయమాటలు చెప్పి ఈ నెల 20వ తేదీన కోటవురట్ల మండలం పాములవాకలోని పట్టాలమ్మతల్లి గుడికి తీసుకువెళ్లింది. తిరుగుప్రయాణంలో తాండవ నది గట్టు దాటాక బహిర్భూమికి వెళ్లాలంటూ బైకు ఆపించి రోడ్డుపక్కన జీడితోటలోకి తీసుకువెళ్లింది. కాసేపు కూర్చుందామని చెప్పి భర్త తలను ఒడిలో పెట్టుకుంది. అప్పటికే అక్కడ మాటువేసిన రాము.. తనవెంట తెచ్చుకున్న సుత్తితో తలవెనుక బలంగా కొట్టాడు. 
 
దీంతో అప్పలనాయుడు అక్కడికక్కడే కూలిపోయాడు. తర్వాత ఇద్దరూ కలిసి రాళ్లతో కొట్టి చంపేశారు. మృతదేహాన్ని రోడ్డుకు చేర్చారు. రాము అక్కడ నుంచి జారుకోగా జానకి అక్కడే ఉండి రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయాడంటూ వచ్చి, పోయేవారిని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. హత్యచేసినట్లు గుర్తించి ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండు తరలించినట్టు ఏఎస్పీ వివరించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు