సీఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి సమన్లు.. 12వ తేదీన విచారణకు..?

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:35 IST)
సీఎం జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి న్యాయస్థానం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. ఏడేళ్ల కిందటి కేసుకు సంబంధించిన సమన్లు ఇవి. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన న్యాయస్థానానికి విజ్ఙప్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలా? లేదా? అనేది ఈ కేసు తీవ్రత ఆధారంగా న్యాయస్థానం తీసుకోవచ్చని చెబుతున్నారు.
 
20214 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ జగన్.. 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రచారాన్ని నిర్వహించారంటూ ఆయనపై కేసు నమోదైంది. అప్పట్లో కోదాడ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. 
 
జాతీయ రహదారి మీద ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందంటూ అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో జగన్‌ను ఎ1 చేర్చారు.
 
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో మిగిలిన ఎ2, ఎ3గా ఉన్న వారిపై కేసులను కొట్టేసింది న్యాయస్థానం. వారు వ్యక్తిగతంగా న్యాయస్థానానికి హాజరు కావడం, వివరణ ఇవ్వడంతో కేసును కట్టేసింది. 
 
తాజాగా ఇదే కేసులో ఎ1 ఉన్న వైఎస్ జగన్‌ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఫలితంగా నాంపల్లి న్యాయస్థానం సమన్లను జారీ చేసింది. ఈ నెల 12న కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరేలా ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తారని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు