నిమ్మగడ్డ ఓటును తొలగిస్తే... సీఎంకు ఎలా ఉంచారు? టీడీపీ నేతల ప్రశ్న

శుక్రవారం, 29 జనవరి 2021 (11:32 IST)
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు తన సొంతూరిలో ఓటు లేదు. నిజానికి ఆయనకు హైదరాబాద్‌లో ఉన్న ఓటు హక్కువుంది. దాన్ని తన సొంత గ్రామానికి బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారుల అలసత్వం కారణంగా ఆయన పేరు ఓటర్ల జాబితాలోకి ఎక్కలేదు. స్థానికంగా నివాసం ఉండటం లేదని, అందువల్లే ఓటు ఇవ్వలేకపోతున్నామని వివరణ ఇచ్చారు. 
 
కానీ, ఆయనకు సొంత నివాసం, పొలాలున్నా ఓటు హక్కు ఇవ్వకపోకవడం దారుణమని స్థానికులు అంటున్నారు. ఆయనకు ఓటు హక్కు కల్పించేందుకు తగు కారణాలున్నాయని, వాటిని విస్మరించి కావాలనే ఓటును 'ఆర్డినరీ రెసిడెన్సీ' అనే సాకుచూపి తిరస్కరించారని కొందరు నిపుణులు అంటున్నారు. సాధారణంగానే ఉద్యోగులకు 'టెంపరరీ మైగ్రేటెడ్‌' అనే క్లాజుతో ఓటు హక్కు కల్పిస్తారని.. కానీ తిరస్కరిస్తూ పోతే రాష్ట్రంలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికీ ఓటు హక్కు ఉండదని చెబుతున్నారు.
 
ఇదే అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలతో పాటు.. ఇతర రాజకీయ పార్టీల నేతలు స్పందిస్తూ, స్థానికంగా ఉండటం లేదన్న కారణంతో నిమ్మగడ్డకు ఓటు హక్కును కల్పించలేదు. మరి, తాడేపల్లిలో ఉంటున్న ముఖ్యమంత్రి జగన్‌కు పులివెందులలో ఓటును ఎలా ఉంచుతారని ప్రశ్నిస్తున్నారు. 
 
జగన్‌కు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పులివెందులలో ఓటు ఉన్నప్పుడు.. తన స్వగ్రామానికి కేవలం 25 కి.మీ. దూరంలోని విజయవాడలో ఉంటున్న రమేశ్‌కుమార్‌కు ఓటు హక్కు ఎందుకు ఉండదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. 
 
కేవలం రాజకీయ దురుద్దేశంతో రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి ఓటు లేకుండా చేశారని, రాజకీయ వికృత క్రీడలో చిన్న ఉద్యోగులను బలిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అధికారులు నిమ్మగడ్డకు ఓటు హక్కు కల్పించడంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు