శ్రీవారి ప్రసాదం లడ్డూలో మొన్న పిన్ను.. నేడు నల్ల కాళ్ళజెర్రీ...

మంగళవారం, 10 మే 2016 (10:11 IST)
తిరుమల శ్రీవారి లడ్డూల మరోసారి నిర్లక్ష్యం మరోసారి వెలుగుచూసింది. మొన్నటికి మొన్న శ్రీవారి లడ్డూలో పిన్ను కనిపించింది. ఓ లడ్డూలో పిన్ను ఉందంటూ ఓ భక్తుడు దాన్ని తిరిగిచ్చేశాడు. లడ్డూలో ఉన్న పిన్ను చూసి శ్రీవారి సేవకులు కూడా ఖంగుతిన్నారు. ఆ సంభవాన్ని మరువక ముందే మరో డొల్లతనం బయటపడింది. తిరుపతి లడ్డూలో జీడిపప్పులు, కిస్ మిస్, పటికబెల్లంతో పాటు ఇనుపముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు వచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. 
 
తాజాగా, తిరుపతి లడ్డూలో చనిపోయిన విషపూరిత నల్ల కాళ్ల జెర్రీ కనిపించింది. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని రామాపురం కాలనీకి చెందిన గొన్నాబత్తుల దేవీ ప్రసాద్, త్రినాథ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం లడ్డూలు కొనుగోలు చేశారు. తిరిగి ఆదివారం తమ గ్రామానికి చేరుకున్నారు. ప్రసాదాలు పంచేందుకు సోమవారం లడ్డూను ముక్కలు చేయగా జెర్రీ బయటపడడంతో భక్తులు ఖంగుతిన్నారు. ఈ సంఘటనపై తాము విస్మయం చెందామని, భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదంలో ఇటువంటివి ఉండటం సరికాదని వారు మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి