ఏకంగా విద్యార్థిని ఇంటికి వచ్చి కోర్కె తీర్చమన్న హెడ్మాస్టర్ ... ఎక్కడ?

ఆదివారం, 23 ఆగస్టు 2020 (17:35 IST)
చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఓ హెడ్మాస్టర్ కీచకుడిగా మారిపోయాడు. ఓ మైనర్ బాలికను కోర్కె తీర్చాలంటూ రెండేళ్లుగా వేధిస్తూ వచ్చాడు. పైగా, తన కోర్కె తీర్చకుంటే ఇంటికి వస్తానంటూ బెదిరించాడు. చివరకు అన్నంత పనిచేశాడు. లాక్డౌన్ వేళ నేరుగా ఆ బాలిక ఇంటికి వచ్చిన హెడ్మాస్టర్ కోరిక తీర్చాలంటూ మైనర్ బాలికను సతాయించాడు. విద్యార్థిని తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీయడంతో ఆ కీచక హెడ్మాస్టర్ బండారం బయటపడింది. అంతే.. హెడ్మాస్టర్‌ను గ్రామస్తుల సహకారంతో పట్టుకుని బడితెపూజ చేసి పోలీసులకు అప్పగించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కందూరులోని జెడ్పీహెచ్ఎస్‌ పాఠశాలలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం కందూరులోని జడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకున్న ఓ మైనర్‌ విద్యార్థినితో పాఠశాల హెడ్మాస్టర్‌ నారాయణ అసభ్యంగా మాట్లాడుతూ, బాలికను నిత్యం వేధించేవాడు. ఆమెను శారీరకంగా వాడుకోవడానికి పలు రకాలుగా ప్రయత్నం చేశాడు. 
 
లాక్డౌన్‌ వల్ల పాఠశాలలు మూతపడడంతో ఏదో వంకతో ఇంటికి ఫోన్‌ చేసి బాలికతో మాట్లాడి తన కోరిక తీర్చాలని కోరేవాడు. లేకుంటే మీ ఇంటికి వచ్చి అడుగుతా అని వేధింపులకు గురిచేసేవాడు. కీచక ప్రధానోపాధ్యాయుడు ఓరోజు ఏకంగా ఇంటికే వచ్చి బాలికతో మాట్లాడుతూ కోరిక తీర్చాల్సిందిగా అడిగాడు. 
 
అనుమానం వేసి తల్లిదండ్రులు బాలికను నిలదీయగా రెండేండ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో కీచక ప్రధానోపాధ్యాయుడిని బంధించి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించడంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హెడ్మాస్టర్‌ నారాయణను వెంటనే విధుల నుంచి తొలగించి కఠిన శిక్ష విధించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు