నిన్న వాహన రవాణాకు .. నేడు షుటింగులకు కేంద్రం అనుమతి

ఆదివారం, 23 ఆగస్టు 2020 (13:51 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత మార్చి నెల నుంచి బంద్ అయిన వాహన రాకపోకలు, షూటింగులు తిరిగి ప్రారంభంకానున్నాయి. అంతర్రాష్ట్ర వాహన రాకపోకలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. పైగా, ఈ వాహనాలను అడ్డుకోవద్దని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం రాత్రి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేశారు. 
 
ఇపుడు దేశంలో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగులకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. అయితే, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగులు నిర్వహించుకోవాలని సూచించింది. షూటింగ్స్‌లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, ఆరోగ్యసేతు యాప్‌ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మార్గదర్శకాలు విడుదల చేశారు. 
 
షూటింగ్‌ సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ విజిటర్లకు అనుమతి ఇవ్వొద్దని, మేకప్‌ సిబ్బంది ఖచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలని, తక్కువ సిబ్బందితో చిత్రీకరణ జరిపేలా చర్యలు చేపట్టాలని, థియేటర్లలో సోషల్‌ డిస్టెన్స్‌ అమలు చేస్తూ సీటింగ్‌ ఏర్పాటు చేయాలని, టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరపాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 
 
మరోవైపు, శనివారం రాత్ర కేంద్ర హోం శాఖ జారీచేసిన ఆదేశాల్లో వ్యక్తుల, వాహనాల రవాణాను అడ్డుకోరాదని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణికులను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవద్దని, కొన్ని రాష్ట్రాలు ప్రజలను తమ రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాయని, ఇకపై అలా చేయవద్దని కోరింది.
 
కేంద్రం ఆదేశాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కారణంగా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ఆర్టీసీని తిరిగి పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అధికారులు కీలక చర్చలు జరపాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో పరిమిత సంఖ్యలో బస్సులు తిరుగుతున్నప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్యా ఆర్టీసీ, ప్రైవేటు బస్ సర్వీసులు లేవన్న సంగతి తెలిసిందే. 
 
ఇదేసమయంలో కర్ణాటక నుంచి వస్తున్న బస్సులను ఏపీ అనుమతిస్తోంది. తమిళనాడు, తెలంగాణ నుంచి మాత్రం బస్సులను అనుమతించడం లేదు. ఇక అత్యవసర పనులపై ప్రయాణాలు సాగించాల్సిన వారు, సొంత వాహనాల్లోనో, అద్దె వాహనాల్లోనో సరిహద్దుల వద్దకు వెళ్లి, నిబంధనల మేరకు స్క్రీనింగ్ తర్వాత తమ గమ్యాలకు చేరుతున్నారు. ప్రైవేటు వాహనాల భారం చాలా అధికంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. 
 
కరోనా కారణంగా గత మార్చి నుంచి బస్సులను తిప్పకపోవడంతో, ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీలకు తీవ్ర నష్టం ఏర్పడింది. కేంద్రం నుంచి గట్టి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో, తిరిగి బస్సులను పునరుద్ధరిస్తే, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, ఈ విషయంలో ఏపీ అధికారులతో నేడో, రేపో చర్చించనున్నామని టీఎస్ ఆర్టీసీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు