ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుతున్న ఓట్ల లెక్కింపు!

ఆదివారం, 14 మార్చి 2021 (10:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపాలక సంఘాలకు నిర్వహించిన ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు మొదలైంది. 83 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచిందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. 
 
12 కార్పొరేషన్లకు గాను 11 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపులో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలై.. సాయంత్రానికల్లా పూర్తి కానుంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు/నగర పంచాయతీల మేయర్లు/డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు/వైస్‌ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు. 
 
మరోవైపు, ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 4026 కౌంటింగ్‌ టేబుళ్లను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఏర్పాటు చేసింది. వీటిల్లో నగర పాలక సంస్థల్లో 2,204, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 1,822 ఉన్నాయి. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా 4,317 మందిని, లెక్కింపు సిబ్బందిగా 12,607 మంది నియమితులయ్యారు. 
 
ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 20,419 మంది పోలీసులను నియోగిస్తున్నారు. వీరిలో 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు, 1,345 మంది ఎస్సైలు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు