ఏపీ పోలీసులను గడ్డిపోచలా చూస్తున్న ట్విట్టర్.. కఠిన చర్యల దిశగా...

ఆదివారం, 20 జూన్ 2021 (12:28 IST)
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్లలో ఒకటైన ట్విట్టర్ అటు రాష్ట్ర ప్రభుత్వాలనే కాదు కేంద్రాన్ని కూడా ధిక్కరిస్తుంది. దీంతో కేంద్రం ఆదేశాలను పాటించేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. తాజాగా ఏపీ పోలీసులు చేసిన వినతిని ట్విట్టర్ యాజమాన్యం తోసిపుచ్చింది. 
 
ఏపీ డీజీపీ పేరిట నకిలీ ట్విటర్‌ ఖాతా కేసుకు సంబంధించి వివరాలివ్వాలని విజయవాడ పోలీసులు పంపిన మెయిల్‌ను ట్విటర్‌ బేఖాతరు చేసింది. ఈ అంశంపై ఇప్పటికి మూడుసార్లు మెయిల్స్ పంపినా ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా, ఖాతాదారుల సమాచారాన్ని అందించలేమని నిరాకరించింది. అంతేకాదు తమకు ఖాతాదారుల వ్యక్తిగత భద్రత ముఖ్యని వాదిస్తోంది. దీంతో ఆ సంస్థపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 
 
మూడు వారాల క్రితం ఇటీవల కొందరు గుర్తుతెలియని వ్యక్తులు డీజీపీ ఆంధ్రప్రదేశ్‌ అనే పేరుతో నకిలీ ట్విటర్‌ ఖాతాను ప్రారంభించారు. గౌతం సవాంగ్‌ ఫొటో కూడా ఆ ఖాతాకు జోడించారు. పోలీసులు దీన్ని ట్విటర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ఖాతాను మాత్రమే తొలగించారు. అంతేకానీ అడిగిన సమాచారం ఇచ్చేందుకు సమ్మతించలేదు. ఈ వ్యవహారంపై విజయవాడ సైబర్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
 
దర్యాప్తుకు సహకరించకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని విజయవాడ పోలీసుల మెయిల్ ద్వారా హెచ్చరించినా ట్విట్టర్ యాజమాన్యం స్పందించడం లేదు. కేసులు మరింత స్ట్రాంగ్‌ చేసేందుకు కేంద్రం ఇటివల తెచ్చిన ఐటీ చట్టాలను ఏపీ పోలీసులు పరిశీలిస్తున్నారు.
 
ఎవరి ఐపీ చిరునామాతో ఆ నకిలీ ట్విటర్‌ ఖాతాను సృష్టించారు? దీని వెనుక ఎవరున్నారు? ఏదైనా కుట్ర దాగుందా? అన్న కోణాల్లో విచారణ మొదలు పెట్టారు. కేసు ముందుకు సాగాలంటే ఐపీ చిరునామాకు సంబంధించిన వివరాలు అవసరం. 
 
వీటి కోసం పోలీసులు ట్విటర్‌ను మెయిల్‌ ద్వారా సంప్రదించారు. దర్యాప్తులో లాగ్స్‌ కీలకమని, ఇవ్వకపోతే  చట్టపరంగా ముందుకెళతామని మూడోసారి హెచ్చరించినా సమాధానం రాలేదు. దీంతో నోటీసులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు