విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాల్సిన ప్రత్యేక ప్యాకేజీపై తుది కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి అందించే సాయంపై హస్తినలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రత్యేకహోదాకు సమానమైన ప్యాకేజీని ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆర్థికలోటు భర్తీ సహా ఏపీకి భారీగా నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోంది. హోదాను మించిన ప్యాకేజీ ఉంటుందని ఇప్పటికే హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ఏపీ నేతలకు చెప్పినట్లు సమాచారం.
మరోవైపు రైల్వేజోన్ను విశాఖకు కేటాయించకుండా విజయవాడకు కేటాయించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అపుడే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖకు రైల్వేజోన్ లేదనడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి సురేష్ప్రభుతో ఫోన్లో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల ముందు అందరం కలిసి మాటిచ్చామని ఆయన కేంద్రమంత్రికి గుర్తుచేశారు. వేరే రాష్ట్రాలు అభ్యంతరం చెబితే రైల్వేజోన్ను ఎలా మారుస్తారని ఆయన కేంద్రమంత్రిని ప్రశ్నించారు.