నేడు ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం!!

వరుణ్

గురువారం, 4 జులై 2024 (09:11 IST)
ఢిల్లీ పర్యటనలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. తొలుత ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశమవుతారు. ఇందుకోసం ఆయన బుధవారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానితో సమావేశంకానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సీఎం రేవంత్‌కు అపాయింట్మెంట్ ఇచ్చింది. అయితే, ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ప్రధానితో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిపే సమావేశాల్లో తమతమ రాష్ట్రాల్లోని సమస్యలను ఏకరవు పెట్టనున్నారు. ముఖ్యంగా, విభజన హామీలను తక్షణం అమలు చేయాలని, విభజన సమస్యలను పరిష్కరించాలని వారు కోరనున్నారు. 
 
తెలంగాణ సీఎం మాత్రం గత వారమే ప్రధానితో భేటీ కావాల్సి వుంది. కానీ, లోక్‌సభ సమావేశాల దృష్ట్యా అది వాయిదాపడింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఈ భేటీ జరుగనుంది. తెలంగాణాకు సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావల్సిన అనుమతులు, లభించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్ర పథకాల నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. 
 
ముఖ్యంగా, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బొగ్గు గనుల వేలం పాటల్లో సింగరేణికి భాగస్వామ్యం కల్పించడం, సైనిక్ స్కూల్ ఏర్పాటు, రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్రానికి అప్పగించడం, విభజన చట్టంలోని అపరిష్కృతంగా ఉండిపోయిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గిరిజన వర్శిటీకి నిధుల కేటాయింపు తదితర అంశాలను ప్రధాని దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లనున్నారు. ఇదిలావుంటే, శనివారం నాడు హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు