నాడు శాసనమండలిని రద్దు చేశారు.. నేడు ఏకగ్రీవంగా వైకాపా అభ్యర్థుల గెలుపు

శుక్రవారం, 5 మార్చి 2021 (11:58 IST)
మూడు రాజధానుల ప్రతిపాదిత బిల్లుకు శాసనమండలి ఆమోదముద్ర వేయలేదన్న అక్కసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాడు ఏకంగా శాసనమండలినే రద్దు చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి.. కేంద్రానికి కూడా పంపించింది. ఈ క్రమంలో తాజాగా శాసనమండలి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైకాపాకు చెందిన ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
 
వీరిలో మహమ్మద్‌ ఇక్బాల్‌, కరీమున్నీసా, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, చల్లా భగీరథ రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్‌, సి.రామచంద్రయ్యలు ఉన్నారు. ఈ ఆరుగురు మినహా మరెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడం, నామినేషన్ల దాఖలుకు గురువారమే ఆఖరి రోజు కావడంతో వీరి అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. 
 
గురువారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలిసి వారంతా పార్టీ బీ-ఫారమ్‌లను అందుకున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెంటరాగా, శాసనమండలి కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారిని కలిసి తమ నామినేషన్లు అందజేశారు. వారి అభ్యర్థిత్వాలను రిటర్నింగ్‌ అధికారి ఖరారు చేశారు. 
 
కాగా, ఆరు శాసనమండలి సభ్యత్వాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లడంతో అధికార పార్టీ బలం 18కు చేరింది. ప్రస్తుతం మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య 26. ప్రొగ్రెసివ్‌ డెమోక్రట్‌ ఫ్రంట్‌ బలం ఐదు, బీజేపీ, స్వతంత్రులు, ఖాళీలు మూడేసి చొప్పున ఉన్నాయి. వైసీపీలో వెనుకబడిన వర్గాలకు అత్యంత ప్రాధాన్యం లభిస్తున్నదనీ, పార్టీ కోసం ముందునుంచీ కష్టపడినవారికే జగన్‌ పదవులు ఇస్తున్నారనీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు