ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ : చంద్రబాబుతో సహా 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్

సోమవారం, 30 నవంబరు 2020 (16:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభమైన తర్వాత తొలుత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దివంగత ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా సభను కొద్దిసేవు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైన తర్వాత సభా కార్యక్రమాలను టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ చీఫ్ చంద్రబాబు సహా 12 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 
 
ఒకరోజు పాటు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెండ్ అయినవారిలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయస్వామి, రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, భవానీ, గద్దె రామ్మోహన్‌, జోగేశ్వరరావు, సత్యప్రసాద్‌, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవానీ, పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్‌ తదితరులు ఉన్నారు. దీంతో అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన చంద్రబాబు, ఎమ్మెల్యేలు.. రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 
 
అంతకుముందు చంద్రబాబుపై సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సభలో రౌడీయిజం చేస్తున్నారని, మళ్లీ ఆయనకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు చంద్రబాబు తీరు ఉందన్నారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. డిసెంబర్ నెలాఖరునాటికి ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు కావాలనే పోడియం ఎదుట బైఠాయించారని, గతంలో ఏ ప్రతిపక్ష నేత ఇలా వ్యవహరించలేదని మండిపడ్డారు. 
 
ఇకపోతే, కాగా తుఫాను పంట నష్టంపై ఏపీ అసెంబ్లీలో రగడ జరిగింది. నిమ్మల రామానాయుడు విమర్శలకు సీఎం జగన్ సమాధానం ఇచ్చారు. అయితే సీఎం జగన్ సమాధానంపై మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించగా.. చంద్రబాబు ఎలా మాట్లాడుతారంటూ అధికార పక్షం అడ్డుకుంది. దీంతో అధికార పక్షం తీరుకు నిరసనగా చంద్రబాబు పోడియం ఎదుట బైఠాయించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు