విభజన హామీ మేరకు ప్రత్యేక హోదాను ఇవ్వక పోయినా ఫర్లేదు కాదనీ.. రైల్వే జోన్ ఇచ్చి, రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం ప్రయత్నాలు జరిపామని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.
అలాగే రైల్వే జోన్ ఇవ్వాలని, రెవెన్యూ లోటు భర్తీ చేయాలని తాము కేంద్రప్రభుత్వాన్ని అడుగుతున్నామని ఆయన అన్నారు. బడ్జెట్పై తాము కసరత్తు మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. అన్ని శాఖలతో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారని అన్నారు. విభజన తర్వాత ఏపీలో ఎన్ని సమస్యలు ఉన్నా రెండంకెల వృద్ధిరేటు సాధించామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని విద్యుత్ రంగంలో తాము తీసుకున్న చర్యల ఫలితంగా మిగులు స్థాయికి చేరుకోగలిగామని చంద్రబాబు నాయుడు తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయాలతో సానుకూల వాతావరణం ఏర్పడిందని ఆయన చెప్పారు. ఒకవైపు రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్నప్పటికీ సుస్థిరమైన వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని ఆయన అన్నారు. జీఎస్టీ సవరణ బిల్లు వల్ల రాబోయే రోజుల్లో రెవెన్యూ పెరుగుతుందని ఆయన తెలిపారు.