ఏపీలో వలసకూలీలకు మాత్రమే అనుమతి... పొరుగు రాష్ట్రాల వారు రావొద్దు...

ఆదివారం, 3 మే 2020 (15:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మే 17వ తేదీకి వరకు పొడగించడం జరిగింది. అయితే, అనేక సడలింపులను కేంద్రం కల్పించింది. ముఖ్యంగా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకుల తరలింపునకు అంతర్‌రాష్ట్ర రవాణాకు అనుమతి ఇచ్చింది. దీంతో వలస కూలీల తరలింపునకు భారతీయ రైల్వే శాఖ కూడా శ్రామిక్ స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది. ఈ రైళ్లు ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలకు బయలుదేరాయి. 
 
ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణా చర్యలపై సీఎం జగన్ ఆదివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని పొరుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలను విజ్ఞప్తి  చేశారు. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందు పడొద్దని సూచించారు. 
 
కేంద్ర హోంశాఖ మార్గరద్శకాల ప్రకారం వలస కూలీలకు మాత్రమే అనుమతి ఉందని, వేల సంఖ్యలో ఉన్న వలస కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్‌లో పెడుతున్నామని గుర్తుచేశారు. వైద్య పరీక్షలు చేసి, వారికి సదుపాయాలు కల్పిస్తున్నామని, అందువల్ల మిగిలిన వారు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 'కరోనా' దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండటం క్షేమకరమని, ప్రయాణాల వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని, ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు