టిడిపి-కాంగ్రెస్ దోస్తి... జనంలోకి వెళ్ళాలంటేనే భయపడుతున్న కార్యకర్తలు...

శనివారం, 3 నవంబరు 2018 (19:45 IST)
కాంగ్రెస్ - టిడిపి కలయికతో కొత్త చిక్కు వచ్చి పడింది. రెండు పార్టీలలోని అధినేతలు కలుసుకున్నంత ఈజీగా క్రిందిస్థాయి కార్యకర్తలు కలవలేకపోతున్నారు. నిన్నమొన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్సలు చేసుకున్న నేతలు ఇప్పుడు కలిసి ప్రజల్లోకి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. దేశంలో ఉన్న నాయకుల సంగతి అటుంచితే తిరుపతిలో ఉన్న కాంగ్రెస్ - టిడిపి నాయకులు మాత్రం కలిసి పనిచేయడమన్నది సాధ్యం కాదని తేల్చేస్తున్నారు. 
 
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పడింది. ఇప్పటికే ఆ పార్టీలోకి ఎన్నో పార్టీలు కలిశాయి. తాజాగా ఎపికి చెందిన తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో కలిసిపోయింది. కూటమిలో కలవడమే కాకుండా ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కలిశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి శాలువా కప్పి చర్చలు జరిపారు. దీంతో రెండు పార్గీలు కలిసిపోయాయి. ఇదంతా బాగానే ఉంది. 
 
అయితే సరిగ్గా నెలరోజుల క్రితం వరకు కాంగ్రెస్ - టిడిపి నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్సలు చేసుకునేవారు. ఎపిలో కాంగ్రెస్ లోని ముఖ్య నేతలు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌తో పాటు మిగిలిన నేతలందరూ చంద్రబాబు నాయుడును ఆ పార్టీలోని నేతలను ఏకిపారేసిన వారే. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోని నేతలందరిపైనా విమర్సల వర్షం కురిపించారు. ఎప్పుడో చచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ అంటూ తీవ్రస్థాయిలో విమర్సలూ చేశారు టిడిపి నేతలు. 
 
ఇది జరుగుతుండగానే టిడిపి - కాంగ్రెస్ పార్టీలు కలవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మోడీని వ్యతిరేకించే వారు, బిజెపి పాలనను తరిమికొట్టేందుకు కలిసి వచ్చే వారందరితోను కలిసేందుకు సిద్థమంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఏ పార్టీతోనైనా కలిసేందుకు తాము సిద్థమని, అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచే ఉంటుందంటున్నారు. అయితే తిరుపతిలో మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కాంగ్రెస్ -టిడిపి కలయిక కాంగ్రెస్ పార్టీకే నష్టమంటూ చెప్పుకొచ్చారు. ఎంత నష్టం జరిగినా బిజెపిని ఎదుర్కోవాలి కాబట్టి ఈ కలయిక తప్పదంటున్నారు. 
 
కాంగ్రెస్ - టిడిపిలు కలిసి 24 గంటలు గడవకముందే చింతామోహన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తిరుపతిలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
ఒక మాజీ కేంద్రమంత్రిగా పనిచేసి, అపారమైన రాజకీయ అనుభవం ఉన్న చింతామోహన్ లాంటి వ్యక్తి అందరినీ కలుపుకుని పోవాలే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటున్నారు టిడిపి నేతలు. బిజెపికి వ్యతిరేకంగా ముందుకు సాగాలే తప్ప ఎవరికి వారు విమర్సలు చేసుకుంటే ఉపయోగం లేదంటున్నారు. 
 
తెలుగుదేశంపార్టీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టారన్న ప్రచారం లేకపోలేదు. చంద్రబాబు - రాహుల్ గాంధీలు కలిసిపోయి పార్టీలను కలిపేసినా క్రిందిస్తాయి నేతలు మాత్రం కలవడం సాధ్యం కావడం లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు