ఏపీలో మెడిసిన్ ప్రవేశ పరీక్షా ఫలితాలు వాయిదా.. ఇంజనీరింగ్ ఫలితాలు వెల్లడి

సోమవారం, 9 మే 2016 (21:04 IST)
జాతీయ స్థాయిలో వైద్య కోర్సుల ప్రవేశానికి నీట్ (జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష) తప్పనిసరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం రాత్రి స్పష్టమైన తీర్పును వెలువరించింది. వైద్య కోర్సుల ప్రవేశానిక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెడిసిన్ ప్రవేశ ఫలితాలను వాయిదా వేసింది. కేవలం ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలనే విడుదల చేశారు. మరో రెండు రోజుల తర్వాత సుప్రీం తీర్పుపై చర్చించిన అనంతరం మెడిసిన్ ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 
 
ఇదిలావుండగా, ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విశాఖలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు బాగా ఆలస్యమైంది. తీర్పులో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చర్చించాం. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లాం. చివరకు మెడిసిన్‌ ఫలితాలను ఆపి కేవలం ఇంజినీరింగ్‌ ఫలితాలను మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించాం' అని అన్నారు. ఇంజినీరింగ్‌లో గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గినట్లు గంటా తెలిపారు. ఈ పరీక్షా ఫలితాల్లో టాపర్లు వీరే.. 
 
1. సత్తి వంశీకృష్ణారెడ్డి (158) 
2. చప్పిడి లక్ష్మీనారాయణ (157) 
3. కొండా విఘ్నేష్‌ రెడ్డి (157) 
4. ప్రశాంత్‌రెడ్డి (156) 
5. గంటా గౌతమ్ ‌(156) 
6. దిగుమర్తి చేతన్‌ సాయి (155) 
7. తాళ్లూరి సాయితేజ (154) 
8. అజయ్‌ జార్జ్ ‌(154) 
9. సాయి దినేష్‌ (154) 
10. నంబూరి జయకృష్ణసాయి (154) 

వెబ్దునియా పై చదవండి