హైకోర్టులో రేషన్ డీలర్లకు ఊరట: గోనె సంచుల డబ్బులు డీలర్లకు చెల్లించాల్సిందే

శనివారం, 8 జనవరి 2022 (19:27 IST)
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రేషన్ డీలర్లకు ఊరట లభించింది. గోనె సంచులను డబ్బులు ఇచ్చే తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది ఏపీ హైకోర్టు. ఒక్కో సంచికి ఇరవై రూపాయలు చొప్పున ఇచ్చి తీసుకోవాలని‌ ప్రభుత్వానికి సూచించింది.
 
కాగా దశాబ్ధాలుగా కమిషన్‌తో పాటు గోనె సంచుల ద్వారా ఆదాయం పొందుతున్న రేషన్ డీలర్లకు తాజాగా డబ్బులు ఇచ్చేది లేదని అధికారులు ఆదేశించారు. దీంతో రేషన్ డీలర్లు హైకోర్టును ఆశ్రయించారు. డీలర్ల తరపున హైకోర్టులో న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. దీనిపై గోనె సంచుల డబ్బులు రేషన్ డీలర్లకే చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. 
 
గతేడాది రేషన్ డీలర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేషన్ షాపులు బంద్ చేపట్టారు డీలర్లు. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్కిలస్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని రేషన్ డీలర్లు కోరారు. వీరి నుంచి ఐసీడీఎస్‌కు మళ్లించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డీలర్లు డిమాండ్ చేశారు.
 
అలాగే, గోనె సంచులను తిరిగి ప్రభుత్వానికిస్తే రూ.20 చెల్లించాలనే జీవోను అమలు చేయాల్సిందేనని డీలర్లు పట్టుబట్టారు. పక్క రాష్ట్రం తెలంగాణలో అది పక్కాగా అమలవుతోందని గుర్తుచేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేదాకా నిరసనలు కొనసాగిస్తామన్న రేషన్ డీలర్లను బుజ్జగించేందుకు మంత్రి కొడాలి నాని, పౌరసరఫరాల శాఖ అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు