న‌న్ను అభినందించ‌డానికి వ‌చ్చి... ఎవ‌రికైనా ఒమిక్రాన్ వ‌స్తే....

శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:05 IST)
ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 2022 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి  పేర్ని వెంకట్రామయ్య ( నాని)  శుక్రవారం ఉదయం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. 
 
 
రాష్ట్రంలో సైతం ఒమిక్రాన్ కేసులు శరవేగంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి నూతన సంవత్సరం వేడుకలు తాను జరుపుకోవడం లేదని మంత్రి  తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలు మీ కుటుంబసభ్యుల మధ్యలో మీరు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. 
 
 
కొత్త ఏడాది వేడుకల తరువాత ఒకవేళ ఒమిక్రాన్ లక్షణాలు వస్తే, కుటుంబం మొత్తం బాధ పడాలి కాబట్టి ముందు జాగ్రత్తలు తప్పనిసరి అని ఆయన అన్నారు.  కోవిడ్ నివారణకు రెండు వాక్సిన్లు తీసుకున్నవారు ఒకవేళ హోటెళ్లు, రెస్టారెంట్లలో బహిరంగంగా వేడుకలు చేసుకునే వారు, ఎంతో కొంత భౌతిక దూరం పాటించాలన్నారు. అలాగే మాస్కు ధరించి గతంలో మాదిరిగానే శానిటైజర్లు వినియోగించాలని మంత్రి  అన్నారు.  
 
 
ప్రస్తుతం ఒమిక్రాన్ విస్తరిస్తున్న దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు, నియోజకవర్గం ప్రజలు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఎవరూ తనను కలవడానికి రావద్దని తాను అందుబాటులో ఉండటం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు