మధ్యవర్తిత్వంతో పరిష్కారం వద్దు.. న్యాయ పరిష్కారమే ముద్దు

బుధవారం, 4 ఆగస్టు 2021 (13:08 IST)
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడానికి ఇప్పట్లో ఫుల్‌స్టాఫ్ పడేలా కనిపించడం లేదు. కృష్ణా జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. తెలంగాణకు వ్యతిరేకంగా జగన్ సర్కారు ఈ పిటిషన్ దాఖలు చేసింది. 
 
ఈ పిటిషన్‌పై సీజేఐ ఎన్వీ రమణ విచారణ చేపట్టారు. సోమవారం జరిగిన విచారణలో ఈ వివాదానికి మధ్యవర్తిత్వమే మంచిదని రమణ చెప్పిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. న్యాయపరంగానే సమస్యకు పరిష్కారాన్ని కోరుకుంటున్నామని ఏపీ తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే కోర్టుకు తెలిపారు. 
 
మరోవైపు, సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్రం కోరింది. అయితే.. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సీజేఐ ఎన్వీ రమణ తోసిపుచ్చారు. అనంతరం ఈ కేసును మరో ధర్మాసనానికి రమణ బదిలీ చేశారు. కాగా.. కృష్ణా ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జల విద్యుదుత్పత్తి చేస్తోందని, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.
 
ఇదిలావుండగా, సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగిన సమయంలో ‘జల వివాదాలను సామరస్యంగా తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చేమో, దయచేసి పరిశీలించండి. అవసరమైతే ఇందుకు సుప్రీంకోర్టు కూడా సహకరిస్తుంది. 
 
ఈ విషయంలో అనవసరంగా కోర్టు జోక్యం చేసుకోవాలని భావించడంలేదు. తెలంగాణ ప్రభుత్వ అసంబద్ధ, అన్యాయమైన చర్యలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కులకు భంగం కలుగుతోంది. చట్టబద్ధంగా దక్కాల్సిన జలాలు దూరమవుతున్నాయి. లీగల్‌గా ఈ పిటిషన్‌పై వాదనలు వినలేను. ఎందుకంటే... నేను రెండు రాష్ట్రాలకూ చెందిన వాడిని. న్యాయపరమైన విచారణే కావాలని, కేంద్ర ప్రభుత్వ జోక్యం తప్పదని భావిస్తే ఈ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తాను’ అని సోమవారం నాడు జరిగిన విచారణలో రమణ ఈ కీలక సూచనలు చేశారు. దీనికి ఏపీ ప్రభుత్వం సమ్మతించలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు