స్టాపిట్... మరోసారి జరిగితే స్పాట్‌లోనే కొట్టేస్తా : తమ్మినేని సీతారాం

శుక్రవారం, 29 నవంబరు 2019 (10:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం మరోమారు వార్తల్లోకెక్కారు. ఇటీవల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సీతారాం... ఇపుడు అధికారులపై అంతెత్తున మండిపడ్డారు. ఈసారి అలా జరిగితే స్పాట్‌లోనే కొట్టేస్తానంటూ హెచ్చరించారు. దీంతో ఆ అధికారి గజగజ వణికిపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో జ్యోతిరావు ఫూలే వర్థంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన మండిపడ్డారు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. 
 
"ఇది కూడా మేము మీకు చెప్పాలా ప్రత్యేకించి? హా... అంబేద్కర్ నీ, ఫూలేనీ... వీళ్లందరి గురించి మీకు ప్రత్యేకించి చెప్పాలా? స్టాపిట్. ఇంకొక్కసారి ఇలా జరిగితే స్పాట్ లో కొట్టేస్తాను. ఏమనుకుంటున్నారు మీరు? మళ్లీ మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకూడదు. (ఆ సమయంలో అక్కడున్న ఓ అధికారి తప్పు తనది కాదని, తనకు కూడా ఉదయం వరకూ తెలియదని వేడుకునే ప్రయత్నం చేశారు) మీరు కాదు ఎవరైనాగానీ..." అని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు