వైజాగ్‌ ప్లాంట్ కోసం "ఉక్కు" సంకల్పంతో పోరాటం చేస్తాం : అచ్చెన్నాయుడు

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (13:42 IST)
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని, ఇందుకోసం ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అచ్చెన్నాయుడు మద్దతు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ విశాఖకు అన్యాయం చేయాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నోరు తెరవడంలేదని మండిపడ్డారు. జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని.. ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయని అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
మరో టీడీపీ నేత కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గొంతు కోసి.. సీఎం జగన్‌, వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేటీకరణకు ముందే అంగీకరించి.. ఏం తెలియనట్లు ప్రధానికి లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామా చేశారని... వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు