కరోనా సాయం : వైకాపా ఎంపీ రూ.4 కోట్లు కేటాయింపు

బుధవారం, 25 మార్చి 2020 (16:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మెల్లగా విస్తరిస్తోంది. ఈ వైరస్ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా ఏపీ సర్కారు అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ, తీసుకోవాల్సిన చర్యలు, సలహాలు, సూచనలు ఇస్తున్నారు. 
 
అదేసమయంలో కరోనా బాధితుల కోసం పలువురు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, సినీ హీరో నితిన్ కూడా రూ.10 లక్షలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైకాపాకు చెందిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఏకంగా రూ.4 కోట్ల సాయం ప్రకటించారు.
 
అయితే, ఈ మొత్తాన్ని తన వ్యక్తిగత నిధుల నుంచి కాకుండా, ఎంపీ నిధుల నుంచి కేటాయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. కరోనా కట్టడికి జగన్ చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు. 
 
వలంటీర్ వ్యవస్థ ద్వారా వైరస్ కట్టడికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సహచర ఎంపీలు కూడా తమ ఎంపీలాడ్స్ నిధుల నుంచి కొంత మొత్తాన్ని కరోనా నియంత్రణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తే రాష్ట్ర ఖజానాపై కొంత భారం తగ్గుతుందని ఆ లేఖలో బాలశౌరి అభిప్రాయపడ్డారు. 

అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు త‌మ రెండు నెల‌ల వేత‌నాన్ని విరాళంగా ప్ర‌క‌టించారు. ఆ రెండు నెల‌ల వేత‌నంలో ఒక నెల వేత‌నాన్ని ప్ర‌ధాని సహాయ నిధికి, మరో నెల వేత‌నాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి  విరాళంగా ఇవ్వనున్నట్టు వైసీపీ ఎంపిలు వెల్ల‌డించారు. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయ‌కుడు విజయసాయిరెడ్డి, ఆ పార్టీ లోక్‌సభాపక్షనేత మిథున్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు