ఏపీలో ప్రారంభమైన ఆర్టీసీ బస్సు సేవలు...

గురువారం, 21 మే 2020 (10:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ సేవలు గురువారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ కారణంగా గత 60 రోజులుగా డిపోలకే పరిమితమైన ఈ బస్సులు... లాక్డౌన్ సడలింపుల కారణంగా రోడ్డెక్కాయి. మొత్తం 436 మార్గాల్లో 1,683 బస్సులు అంటే 17 శాతం బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. 
 
ఈ బస్సుల్లో కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నడుపనున్నారు. అయితే, ప్రయాణికులు బస్సెక్కాలంటే మాత్రం కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఆరోగ్యసేతు యాప్. ప్రతీ ప్రయాణికుడి వద్ద కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ఉంటేనే బస్సులోకి అనుమతిస్తారు.
 
ఇక, ఈ బస్సులు ప్రస్తుతానికి ఓ బస్టాండు నుంచి మరో బస్టాండుకు మాత్రమే నడుస్తాయి. ఈ బస్సుల్లో ఎటువంటి రాయితీలు వర్తించవు. అవసరం అనుకుంటే ఏసీ బస్సులను నడుపుతామని, 26 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే అందులో ఉంచుతామని అధికారులు తెలిపారు. అటెండర్లు ఉండరని, దుప్పట్లు ప్రయాణికులే తెచ్చుకోవాల్సి ఉంటుందని అన్నారు.
 
ఇక 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బస్సుల్లో కండక్టర్లు ఉండరు. అన్ని బస్సులకు ఆన్‌లైన్‌లోనే టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కౌంటర్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారు తమ పేరు, ఫోన్ నంబరు ఇవ్వడం తప్పనిసరి చేసింది. 
 
అయితే, 50 శాతం ప్రయాణికులతో ఈ బస్సులను నడుపనున్న దృష్ట్యా ప్రయాణ ఛార్జీలు పెంచుతారనే ప్రచారం సాగుతోంది. దీనిపై రాష్టర రవాణా శాఖా మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ నష్టం వాటిల్లినా ప్రయాణికులపై మాత్రం భారం మోపబోమని, సాధారణ బస్సు చార్జీలతో 50 శాతం ప్రయాణికులతోనే బస్సులను తిప్పుతామని తెలిపారు. కాగా, తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమైన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు