హీరో బాలకృష్ణ ఎక్స్ పీఏకు మూడేళ్లు జైలు శిక్ష... ఎందుకో తెలుసా?

శనివారం, 13 జులై 2019 (20:26 IST)
అనంతపురం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణకు షాక్ తగిలింది. బాలకృష్ణ పిఏ శేఖర్‌కు జైలు శిక్ష విధించింది నెల్లూరు ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు రుజువు కావడంతో మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షలు జరిమానా విధించింది. 
 
తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శేఖర్ ఎమ్మెల్యే బాలకృష్ణ వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బాలయ్య సినిమాల్లో బిజీబిజీగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఉంటూ బాలకృష్ణ పేరుతో శేఖర్ అక్రమ వసూళ్లకు పాల్పడే వారని ప్రచారం ఉంది. 
 
హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య పీఏ అక్రమ వసూళ్లు అరాచకాలపై టీడీపీ నేతలు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణకు నేరుగా ఫిర్యాదు సైతం చేశారు. అంతేకాదు తనకు వ్యతిరేకంగా ఉండేవారి పట్ల బాలయ్యకు చెడుగా చెప్పేవారని కార్యకర్తలు ఆరోపించేవారు. 
 
దాంతో నియోజకవర్గంలో టీడీపీలో విభేదాలు చోటుచేసుకోవడానికి ప్రధాన కారకుడు అయ్యారని పెద్దఎత్తున వార్తలు వినిపించాయి. ఆరోపణలు తీవ్రం కావడంతో బాలకృష్ణ శేఖర్‌‌ను తప్పించారు. ఇకపోతే శేఖర్‌పై 2008లో కేసు నమోదు కాగా, మూడు రోజుల కిందట నెల్లూరు ఏసీబీ కోర్టు శిక్ష ఖరారు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు