ఆధునిక బోధనా నిలయాలుగా వైయస్ఆర్ ప్రీ-ప్రైమరీ స్కూల్స్

శుక్రవారం, 19 మార్చి 2021 (19:54 IST)
రాష్ట్రంలో పూర్వ పాఠశాల వ్యవస్థను మరింత మెరుగుపరిచే క్రమంలో ప్రముఖ విద్యా సంస్థలతో ఓప్పందం చేసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. చిన్న వయస్సులో పాదుకొల్పిన అంశాలు వారి జీవిత కాలంలో మంచి ఫలితాలను ఇస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేసాయని తదనుగుణంగా తమ శాఖ కార్యచరణ ప్రణళిక సిద్ధం చేస్తుందన్నారు. 
 
పూర్వ పాఠశాలల్లో విద్యా కార్యకలాపాలు పెంచే క్రమంలో ప్రథం ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌తో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఐటీసీ సునెహ్రా కల్ మిషన్ పోజెక్ట్ కు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ సందర్భంగా డాక్టర్ శుక్లా మాట్లాడుతూ 55,607 వైయస్ఆర్ ప్రీ-ప్రైమరీ స్కూల్స్ (అంగన్వాడీ)లో పిల్లల భావోద్వేగం, భాష, అభిజ్ఞా వికాసం పెంపుకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్యను అమలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని వివరించారు. 
 
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, దిల్లీ, హర్యానాలతో సహా పలు రాష్ట్రాల్లో ప్రీ-స్కూల్ లెర్నింగ్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన ప్రథం సంస్ధ ఇప్పుడు వైయస్ఆర్ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే క్రమంలో తమవంతు సహకారం అందిస్తుందన్నారు. ఒప్పందం ఫలితంగా  పిల్లలతో నిర్వహించవలసిన రోజువారి కార్యకలాపాలు అన్ని అంగన్వాడీ ఉపాధ్యాయులకు వాట్సాప్, ఎస్ఎంఎస్ సందేశాల ద్వారా పంపుతారన్నారు. 
 
మరోవైపు అంగన్ వాడీ సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడానికి తగిన శిక్షణ అందిస్తారని తెలిపారు. బోధనా భాషగా ఇంగ్లీషు వాడకాన్ని పెంపొందించే క్రమంలో  ప్రథం డిజిటల్ కంటెంట్‌ను కూడా సిద్ధం చేస్తుందని డాక్టర్ శుక్లా పేర్కొన్నారు. రెవెన్యూ డివిజన్ స్దాయిలో భాగస్వామ్య సంస్ధ తమ మాస్టర్ ట్రైనర్లను అందుబాటులో ఉంచుతుందన్నారు. ప్రాజెక్ట్ లో భాగంగా వైయస్ఆర్ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలకు 100 రోజుల పాఠశాల సంసిద్ధత కార్యక్రమం, ఆంగ్ల భాష భోధనతో పాటు పాఠశాల కార్యకలాపాలు కూడా ఉంటాయన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు